సేవాతత్పరుడు ‘చిన్ని శ్రీనివాస్’
ముస్లిం మహిళలకు రంజాన్
కిట్లు పంపిణి అభినందనీయం
హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త చిన్ని శ్రీనివాస్ సహృద్భావంతో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పలు నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు అపద్భాందవుడయ్యారు. సరస్వతీ పుత్రులకు తన వంతుగా ఆర్ధిక సహకారం అందజేస్తూ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నారు.
సర్వమత సౌభ్రాతృత్వం కోసం అందరితో మమేకమవుతూ సేవా కార్యక్రమాల ద్వారా మన్ననలు పొందుతున్నారు. తాజాగా, ముస్లిం మహిళలకు రూ.700 విలువైన రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలో విద్యా నగర్ కాలనీలో చిన్ని శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హమీద్ షేక్ మాట్లాడారు. చిన్ని శ్రీనివాస్ ప్రతి ఏడాది కొంతమంది ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లను అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్ ఉపవాసదీక్షలను ముస్లిం సోదరసోదరీమణులంతా భక్తి,శ్రద్ధలతో చేపట్టాలని ఆకాంక్షించారు. ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో శక్తివంచన లేకుండా సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని హమీద్ షేక్ పిలుపునిచ్చారు.