ప్రజలకు మంచినీరు అందించలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి * కిన్నెరసాని మంచినీటిని ప్రతిరోజూ సరఫరా చేయాలి * బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ * బీఎస్పీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన
ప్రజలకు మంచినీరు అందించలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
* కిన్నెరసాని మంచినీటిని ప్రతిరోజూ సరఫరా చేయాలి
* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
* బీఎస్పీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలో వారం రోజులుగా తీవ్ర మంచినీటి సమస్య నెలకొందని బీఎస్పి రాష్ట్ర కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం ప్రాంగణంలో ప్ల కార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి పుట్టినట్లు,తనకు తాను అపర భగీరథుడిగా చెప్పుకునే వనమా వారం రోజుల నుంచి పట్టణంలో తీవ్రస్థాయి మంచినీటి ఎద్దడి ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల కనీసం అవసరమైన తాగునీటి సమస్యలు కూడా పరిష్కరించలేని ఎమ్మెల్యే వనమా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలతో చేపట్టిన కిన్నెరసాని మంచినీటి పథకం వనమా కుటుంబం చేసిన అతి పెద్ద అవినీతి కుంభకోనమని విమర్శించారు. నీటి ఎద్దడి రోజు రోజుకు తీవ్రమవుతుందని రానున్న మే జూన్ మాసాలలో పరిస్థితులు మరింత చేయి దాటిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని నీటి సమస్య ఈ విధంగా ఉంటే నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలలో పరిస్థితులను ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలకు కనీస అవసరాలు అయినటువంటి తాగునీటి సౌకర్యం కల్పించలేని నిస్సహాయ దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ సర్కార్ ఉందని ఆక్షేపించారు. సమస్యలను గాలికి వదిలేసి ఆత్మీయ సమ్మేళనాలు ఇఫ్తార్ విందులు సన్మానాలకే ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్ పాలకవర్గం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. నీటి సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే వనమా చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని బీఎస్పీ శ్రేణులు కార్యకర్తలు మహిళలతో అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు గంధం మల్లికార్జున్ రావు, గుడివాడ రాజేందర్, మాలోత్ వీరు నాయక్, శారద, లక్ష్మీ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.