చీటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
…తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మొద్దు.
…తెలియని వ్యక్తులకు డబ్బులు, వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు.
…మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
నారాయణ పేట,అక్షిత ప్రతినిధి:
ప్రస్తుత సమాజంలో వివిధ రూపాల్లో జరుగుతున్న చీటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బంగారం, స్థలాలు, ఆన్లైన్ వ్యాపారాలు, లక్కీ డ్రాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, సులభంగా లోన్, తక్షణ ఉద్యోగం, లాటరీ గెలుపు వంటి ఆశాజనక మాటలతో ప్రజలను నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ కాల్స్, మెసేజ్లను నమ్మి ఎవరూ మోసపోవద్దని హెచ్చరించారు.ఇటీవల కొందరు ఫేక్ డాక్యుమెంట్లు, నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి స్థలాలు, ఇళ్లు అమ్ముతున్నట్లు నటిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆస్తుల కొనుగోలు సమయంలో సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించి, అధికారిక ధృవీకరణ తీసుకున్న తర్వాతే లావాదేవీలు చేయాలని సూచించారు.అలాగే సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని డబ్బులు అడగడం, ఫేక్ అకౌంట్లతో మోసాలు చేయడం, QR కోడ్ స్కాన్ చేయమని చెప్పి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచుకోవడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. అపరిచితులపై నమ్మకం ఉంచి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని సూచించారు.విద్యార్థులు, యువత ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలను మాత్రమే సంప్రదించాలని, ముందస్తుగా డబ్బులు అడిగే సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. మహిళలు బంగారం, చిట్ఫండ్లు, ఆన్లైన్ షాపింగ్ వంటి విషయాల్లో ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.ప్రజలు ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. చీటింగ్ కేసులపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని, మోసగాళ్లను చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.ప్రజల అప్రమత్తతే మోసాలకు అడ్డుకట్ట వేయగలదు. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించాలి అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.