అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
– టియుడబ్ల్యూజే (ఐజేయు) డిమాండ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని టియుడబ్ల్యూజే (ఐ జేయు) జిల్లా ఉపాధ్యక్షులు కలిమెల నాగయ్య ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద గురువారం సీఎం కేసీఆర్ కు పోస్ట్ కార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారని అన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా కేసిఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ప్రభుత్వం పదేళ్ల కాలంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోవడం విచారకరమన్నారు. వివిధ వర్గాల సంక్షేమం పేర పలు పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించడం విచారకరమన్నారు. కరోనా, ప్రకృతి విపత్తుల సమయాలలోనూ నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని సైతం విస్మరించిన జర్నలిస్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పేద వర్గాలకు చెందిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు అనారోగ్యాల బారిన పడినప్పుడు నాణ్యమైన వైద్యాన్ని పొందేందుకు జర్నలిస్ట్ హెల్త్ కార్డులను పునరుద్ధరించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలగునట్లు చూడగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు, జర్నలిస్టులు రంగా శ్రీనివాస్, బాలాజీ, సుమన్, పేర్ల వెంకటయ్య, విజయ్. శ్రీనాథ్, కరుణాకర్, రమేష్ నాయక్, బండా వేణుగోపాల్ రెడ్డి, పొదిలహరి, చిట్యాల శ్రీనివాసరావు, కే.ధనుంజయ రెడ్డి, ఎండీ. సమి తదితరులు పాల్గొన్నారు.