పువ్వాడ కృషితోనే ఖమ్మం ప్రగతి

పువ్వాడను గెలిపిస్తే మళ్లీ మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు

-సిఎం కేసిఆర్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

పువ్వాడను గెలిపిస్తే మళ్లీ మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని ఖమ్మం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలే స్వయంగా చూశారని బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కృషితోనే ఖమ్మం అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.పువ్వాడ పువ్వులు కావాలా..? తుమ్మల తుమ్మ ముల్లులు కావాలా..? అంటూ వ్యంగ్యంగా సీఎం కేసీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయి.ఇక మీ ఇష్టమని ఖమ్మం ప్రజలకు హితవు పలికారు. ప్రభుత్వ విజన్‌ పువ్వాడ మిషన్‌తో ఖమ్మం అభివృద్ధి సాధ్యమైందని గర్వంగా చెప్పారు. వాడవాడలో పువ్వాడ అని పత్రికల్లో వార్తలు వచ్చేవని గుర్తు చేశారు. రూ.700 కోట్లు చేసి ఈ జిల్లాను పువ్వాడ అభివృద్ధి చేయించారని వివరించారు.పువ్వాడను గెలిపిస్తే మళ్లీ మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని హామీ ఇచ్చారు.

50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో కాని పనులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో చేసింది.కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకూ తెలంగాణ లౌకిక రాజ్యంగానే ఉంటుందని బీఆర్‌ఎస్‌ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. పువ్వాడ అజయ్‌ చేతిలో ఓడిపోయి మూలనపడి ఉంటే తుమ్మల నాగేశ్వరరావు ను పిలిచి మంత్రి పదవి ఇచ్చానని చెప్పారు. తుమ్మల వల్ల ప్రజలకు జరిగిన మేలు శూన్యమన్నారు. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేస్తానని ఓ అర్భకుడు అంటున్నారని మండిపడ్డారు. ఏమైనా ఖమ్మం జిల్లాను ఆయన గుత్తకు తీసుకున్నారా అంటూ ధ్వజమెత్తారు. రాబోయే కాలమంతా ప్రాంతీయ పార్టీలదే అని కేసీఆర్‌ తెలిపారు.ఖమ్మం జిల్లా చాలా చైతన్యమైన ప్రాంతమని సీఎం కేసీఆర్‌ అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్య పరిణితి ఇంకా రాలేదన్నారు. ప్రజాస్వామ్య పరిణితి రావాలంటే యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీలు పోటీ చేయడం గెలుపోటములు అనేవి సహజమని పేర్కొన్నారు. అభ్యర్థుల గుణగణాలు పరిశీలించిన తర్వాతనే ఓటేయాలని కోరారు.ఓటు వేసేటప్పుడు అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచించాలని సూచించారు. ఓటర్లు పరిణితితో ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని వివరించారు. ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. 70 ఏళ్ల క్రితం ఖమ్మం కవి రావెళ్ల వెంకట్రామారావు తెలంగాణపై పాట రాశారని గుర్తు చేశారు. నా తల్లి తెలంగాణ రా నందనోద్యానమ్మురా అని ఖమ్మం ప్రజల్లో తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారని కేసీఆర్ గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking