గులాబీ జెండా కొండంత అండ
బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణం పనుల్లో వేగం పెంచాలి
నల్లమోతు సిద్దార్థ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం పనులను యువనేత, బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్థ శుక్రవారం పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని గుత్తేదారులను ఆదేశించారు. మిర్యాలగూడ నియోజక ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. తాము ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటామని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కచ్చితంగా ఆదుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ పట్ల ప్రజల్లో ఇంకనూ సదభిప్రాయం, విశేష ప్రజాదరణ కొనసాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గులాబీ జెండా కొండంత అండ అని చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత నల్లమోతు భాస్కర్ రావుదేనని పేర్కొన్నారు. నల్లమోతు సిద్దార్థ వెంట అడవిదేవులపల్లి మండల ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, దామరచర్ల మండల జడ్పీటీసీ ఆంగోతు లలిత హాతిరాం నాయక్, అడవిదేవులపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీను, వింజం శ్రీధర్, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.