అన్ని పత్రికలకు
సముచిత స్థానం
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ఆయా పత్రికల ప్రాధాన్యతల మేరకు అన్నీ పత్రికలకు సముచిత స్థానం కల్పిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన పిదప ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు, తెలంగాణ చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు అవసరమైన శిక్షణ, గత కొంతకాలంగా చిన్న, మధ్య తరహా పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఆఫ్ గ్రేడ్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, దిన పత్రికలతో పాటు మ్యాగజైన్ లకు కూడా ప్రకటనలు జారీ చేసేలా తగు సూచనలు ఇవ్వాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ అక్రిడిటేషన్ కార్డులు కల్గిన చిన్న మధ్య తరహా పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులకు హైదరాబాద్ లోనే ఇళ్ళ స్థలాలు, ఇళ్ళను కేటాయించేలా చొరవ చూపాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. టియూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీని సైతం కలిసి చిన్న మధ్య తరహా పత్రికల సమస్యలను దృష్టికి తేగా ఆయా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.