దేవరకొండ, అక్షిత ప్రతినిధి :
శ్రీశైలం సొరంగమార్గం డిండి ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.ఆదివారం ఆయన దేవరకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.అనంతరం దేవరకొండ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు, కళాశాలలను నిర్మిస్తామని తెలిపారు.


డిండి క్రాస్ రోడ్ నుండి మైనంపల్లి వరకు 14 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు తో పాటు ,మరో 40 కోట్ల రూపాయలతో రోడ్లు బాగు చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.నల్గొండ నుండి కొల్లాపూర్ వరకు వయా మల్లేపల్లి, దేవరకొండ ,కల్వకుర్తి, మీదుగా జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర రవాణా శాఖ మంత్రిని, ప్రధానమంత్రిని కోరామని, త్వరలోనే ఈ రోడ్డు ను ప్రారంభిస్తామని తెలిపారు.ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి డిండి ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలు కేటాయించి ఉంటే పాలమూరు, నల్గొండ జిల్లాలకు కరువు ఉండేది కాదన్నారు.ఎన్ని వేల కోట్లైనా సరే శ్రీశైలం సొరంగ మార్గం డిండి ప్రాజెక్టు లను త్వరితగత్తిన పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.దేవరకొండ నియోజకవర్గం లో ఎమ్మెల్యే కోటా కంటే ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.
దేవరకొండతో పాటు, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలను నిర్మిస్తామన్నారు.ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు .