తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం..
కాంగ్రెస్పై మండిపడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని నిలదీశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు.రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు.ఫిబ్రవరి బహిరంగ సభలో సర్కార్ వైఖరిని ఎండగతామన్నారు. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు.తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలన్నారు.