రాష్ట్ర సమాచార శాఖ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలి
మీడియా అక్రిడిటేషన్ కమిటీల్లో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలి
జాతీయ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టి కమిషన్ లో ఫిర్యాదు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ జారీ చేసే ప్రకటనలలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద బడ్జెట్ను కేటాయించి, ఎస్సీ ఎస్టీ పత్రికల ను ప్రోత్సహించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ అంబేద్కర్ మీడియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.అలాగే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ లో కూడా డిప్యూటీ డైరెక్టర్ చరణ్ దాసుకు ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మీడియా కమిటీల్లో, అలాగే అక్రిడిటేషన్ కమిటీలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు ప్రాతనిధ్యం కల్పించాలని కోరడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 46 లో సూచించినట్లు ” ప్రభుత్వం బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీల విద్యకు సంబంధించి, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి విశేష శ్రద్ధతో పనిచేయాలని, అన్ని రకాల దోపిడీల నుండి ఆయా వర్గాలను రక్షించాలని” సూచిస్తుంది. ఈ నిబంధన ప్రకారం బడ్జెట్ కేటాయించాలని కోరడం జరిగింది.
అలాగే రాజ్యాంగంలోని 16వ భాగం ఆర్టికల్ 335 ప్రకారం ” యూనియన్ లేదా రాష్ట్ర సర్వీసులు, మరియు పోస్టులను నియామకం చేయుటలో ఎస్సీ ఎస్టీ తెగల వారి దరఖాస్తులను పరిగణంలోకి తీసుకోవాలని” సూచిస్తుంది.
ఈ మేరకు తెలంగాణ మీడియా అకాడమీ ని కూడా విచారణ చేయాలని కోరడం జరిగింది. అలాగే త్వరలో జాతీయ ఎస్టీ కమిషన్ ను కూడా కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ మూడవత్ రాములు, జర్నలిస్టులు శాంతయ్య, ధర్మానాయక్, జర్నలిస్టులు సాయిరాజ్, జగదీశ్వర్ తోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.