కృష్ణమ్మ జలసవ్వడి

కృష్ణమ్మ జలసవ్వడి

సాగర్ క్రస్ట్ గేట్లతో
నీటి విడుదల

18 ఏళ్ల తర్వాత మళ్ళీ
జూలైలో నీటి విడుదల

సాగర్ ప్రాజెక్టు ఒక
ఆధునిక దేవాలయం

ప్రాజెక్టుల ఆధునీకరణ..పూడిక తీస్తాo

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సాగర్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునీకరిస్తామని, అలాగే పూడిక తీస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయం అని అన్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని 22 లక్షల ఎకరాలకు సాగు నీరుతుందని చెప్పారు. జవహర్ కుడి కాలువ ద్వారా 11.74 లక్షల ఎకరాలు, లాల్ బహుదూర్ ఎడమ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 6 లక్షల 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా, నల్గొండ జిల్లాలో 1,50,000 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల 30 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్ష ఎకరాలకు ఆయకట్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరండుతున్నదని తెలిపారు. 2005 సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వర్ణోత్సవాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. తను ఆరుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి పార్లమెంటు సభ్యునిగా ఉంటూ ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రిగా నాగార్జున సాగర్ ద్వారా నీటిని వదలడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గత వానాకాలం, యాసంగి, వానాకాలం కలిసి రెండు లక్షల 81 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించడం జరిగిందని, ఇందులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పాత్ర ముఖ్యమని అన్నారు. సాగు నీటితో పాటు నాగార్జునసాగర్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా గడచిన 4 రోజులుగా 30000 క్యూసెక్కుల నీటిని తో పూర్తిస్థాయిలో,700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు.

నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ,మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ ఈ మల్లికార్జునరావు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. కాగా నాగార్జున సాగర్ ప్రాజక్ట్ ద్వారా మంత్రులు 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువ కు వదిలిన తర్వాత అధికారులు 14 గేట్ల ద్వారా 10932 క్యూసెక్కుల నీరు వదిలారు. మంగళవారం సాయంత్రం వరకు 20 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదలనున్నట్లు ప్రాజక్ట్ అధికారులు తెలిపారు.
అనంతరం మంత్రులు, అధికారులు నాగార్జున సాగర్ ఎడమ కాలువను సందర్శించి కృష్ణ జలాలకు పుష్పాభిషేకం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking