ఇదిగోండి సెక్రటరీ సార్ మీరడిగిన పైసలు
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి .
ఇగోండి కార్యదర్శి సార్ 50వేల రూపాయలు… మీరు అడిగినదే, ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు.. కావాలంటే ఓ సారి లెక్కపెట్టుకోండి.. ఇగ ఇప్పుడైనా మా పని మొదలు పెట్టండి.. మీకు దండం పెడతా.. అంటూ మూవీ సీన్ తలపించే సంఘటన జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలం నగునూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేంగుంట గంగమ్మ 50వేల రూపాయలు తీసుకుని జీపీ ఆఫీస్ ఎదుట సెక్రటరీ అరీఫోద్దిన్కు ఇచ్చే ప్రయత్నం చేసింది. ముగ్గు పోసి నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ఆ ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం లేదని రూ.50వేలు ఇస్తేనే చేస్తానని సెక్రటరీ డిమాండ్ చేస్తున్నట్టు గంగమ్మ ఆరోపించింది.
ఉండటానికి దిక్కు లేకపోతేనే ప్రభుత్వం ఇల్లు ఇస్తే
తన భర్త పేరుపై ఉన్న 2గుంటల భూమి తన పేరు మీదకు మార్పు చేసుకున్న సమయంలో కూడా 30వేల రూపాయలు లంచం తీసుకున్నాడని వాపోయింది. స్థానికంగా ఉన్న నాయకులు చెప్పిన్నట్లే వింటూ, తమను కార్యదర్శి ముప్పు తిప్పలు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఉండటానికి దిక్కు లేకపోతేనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే కార్యదర్శి లంచం అడుగుతున్నాడని తిరిగి తిరిగి ఓపికలేకనే 50వేలు రూపాయలు అప్పు తెచ్చి లంచం ఇస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ విషయమై నగునూర్ కార్యదర్శి అరీఫోద్దిన్ను వివరణ అడిగేందుకు ఫోన్లో సంప్రదించగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.