తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. 

తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. 

ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం

హైదరాబాద్ అక్షిత ప్రతినిధి 

తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. మంత్రి అజారుద్దీన్, ప్రొ.కోదండరామ్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఇవాళ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. వీరిద్దరిని ఎమ్మెల్సీగా తీర్మానం చేస్తూ తెలంగాణ కేబినెట్ గత ఏడాది ఆగస్టు 30న గవర్నర్ కు పంపించారు. అప్పటి నుంచి గవర్నర్ ఈ ఫైల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ సభలో ప్రాతినిధ్యం లేకుండానే కేబినెట్లో స్థానం దక్కించుకున్న అజారుద్దీన్ తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలలలోపు ఏదైనా సభకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది. ఈ గడువు ఏప్రిల్ 30 తో ముగియనుంది. ఓ వైపు గడువు ముంచుకు వస్తుంటే మరోవైపు ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ప్రభుత్వాన్ని ఆందోళన కలిగించింది. ఈ క్రమంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా లోక్ భవన్లో గవర్నర్తో భేటీ అయి ఎమ్మెల్సీల నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ శివ ప్రతాప్ శుక్లా ఈ ఫైల్ పై సంతకం చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మంత్రి అజారుద్దీన్ కు మంత్రి పదవి అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం ఇటు అజారుద్దీన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి భారీ ఊరటగా మారనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking