నర్సు కొంప ముంచిన రూ.299..
ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే..
హైదరాబాద్ అక్షిత బ్యూరో
ఆన్లైన్ మోసాలు నిత్యం పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కొంత మంది చదువుకున్న వారే కేటుగాళ్ల వలకు చిక్కుతున్నారు. తాజాగా రూ. 299 డ్రెస్ కోసం ఆశపడ్డ నర్సు సైబర్ కేటుగాళ్ల బారిన పడి రూ. లక్షల్లో పోగొట్టుకుంది. ఈ ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. ముంబయిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ నర్సు హాస్టల్లో ఉంటోంది. ఇటీవల ఆమె ఫేస్బుక్లో రూ.299కే డ్రెస్ లభిస్తుందనే ప్రకటన చూసి టెంప్ట్ అయింది. వెంటనే ఆ ప్రకటనలో ఉన్న వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేసింది.
దశల వారీగా లూటీ
అవతలి వైపు ఉన్న వ్యక్తులు మొదట డ్రెస్ ధరను ఆమె వద్ద నుంచి వసూలు చేశారు. అనంతరం షిప్పింగ్, జీపీఎస్, ట్రాకింగ్ ఫీజులు, వెరిఫికేషన్ కోడ్స్ అంటూ వివిధ సాకులు చెబుతూ ఆమె దగ్గర నుండి డబ్బులు లాగడం మొదలుపెట్టారు. ఈ రకంగా ఏప్రిల్ 16 నుండి 20 మధ్య ఐదు రోజుల వ్యవధిలో ఆమె దాదాపు రూ.లక్షను వివిధ దఫాలుగా చెల్లించారు. అడిగినప్పుడల్లా డబ్బులు రిఫండ్ చేస్తామని, ఆర్డర్ త్వరలోనే డెలివరీ అవుతుందని నమ్మబలికారు. అయితే, ఎంత కాలం గడిచినా డ్రెస్ రాకపోవడం, రిఫండ్ డబ్బులు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.