ప్రతి పథకం… పేదలకు చేరువవ్వాలి
నల్గొండ, అక్షిత ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం పేదలు,రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ,రైతు సంక్షేమం సహాయ మంత్రి కైలాష్ మిశ్రా అన్నారు.ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిబద్ధతతో రాజకీయాల కతీతంగా అమలు చేసి ప్రతి చిట్ట చివరి లబ్దిదారునికి అందేలా కృషి చేయాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారులు పరిష్కరిస్తారని వారు ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తారని,అధికారులు బాగా పనిచేసి ప్రజల సమస్యలు వెంటనే స్పందించి పరిష్కరిస్తే వారు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని ఆయన గుర్తు చేశారు.ప్రజల పన్నుల తో జీతాలు తీసుకుంటున్నా మని,ప్రజా సేవకులు పని చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందుతారని అన్నారు.పి.యం.సమ్మాన్ నిధి కింద రైతులకు అందరికీ సహాయం అందాలని,భూమి కలిగిన ప్రతి రైతుకూ మూడు విడతలుగా రెండు వేల చొప్పున సంవత్సరం కు 6 వేల రూ.లు అందాలని,పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు పరిశీలించి వెబ్ సైట్ లో పొందు పరచాలని అన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా అమలు చేస్తున్న ఉపాధి హామీ, రూర్భన్ పథకం,జల శక్తి అభియాన్, పథకం,మధ్యాహ్న భోజనం, స్త్రీ,శిశు, సంక్షేమ శాఖ,వైద్య శాఖ ద్వారా వ్యాక్సినేషన్,గృహ నిర్మాణం,మిషన్ భగీరథ,ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తదితర పథకాల అమలు గణాంకాల తో సహా అధికారులు వివరించారు.కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం కు నిధులు కేటాయించి సరఫరా చేస్తున్నందున ప్రధాన మంత్రి ఫోటో/ప్లెక్సీ కూడా చౌక ధర దుకాణాల్లో ప్రదర్శించాలని డి.ఎస్. ఓ.ను ఆదేశించారు.ఇది మొదటి సమావేశం అని,మళ్లీ తరచుగా వస్తానని,తదుపరి సమావేశం లో అధికారులు పూర్తి సమాచారం తో రావాలని,కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరు ప్రభుత్వం కు రిపోర్ట్ చేస్తానని ఆయన అన్నారు .ఏకలవ్య పాఠశాలల స్థాపనకు ప్రతి పాధనలు సమర్పిస్తే మంజూరు చేస్తానని అన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, డి.అర్. ఓ.జగదీశ్వర్ రెడ్డి,డి.అర్.డి. ఓ. కాలిందిని,జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత,జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.