మందమర్రి, అక్షిత ప్రతినిధి:-
నేతాజీ సుభాష్ చంద్రబోస్ సిద్దాంతాలను ఈ తరం యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఇంఛార్జి జీఎం కృష్ణరావు అన్నారు. మందమర్రి ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంఛార్జి జీఎం కృష్ణారావు హాజరై, నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెల్లదొరల పాలన అంతమొందాలంటే అహింసా మార్గం ఒక్కటే సరిపోదని,బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యువతను చైతన్య పరిచి సాయుధ పోరాటం బాట పట్టి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయ సైన్యానికి నాయకత్వం వహించి భారత దేశ దాస్య శ్రుంఖలాలను తెంచి వర్ధంతి లేని ఏకైక స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. నేతాజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏజిఏం ఎఫ్ఏ చక్రవర్తి, టిబిజికేఎస్ ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, పర్సనల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్యాంసుందర్, సీనియర్ పిఒ మైత్రేయ బందు తదితరులు పాల్గొన్నారు.