ఆదివాసి గిరిజన సంఘం మూడవ మహాసభను విజయవంతం చేయండి
– సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
పినపాక అక్షిత ప్రతినిధి:
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహా సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. సోమవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల జివిఆర్ ఫంక్షన్ హాల్ టిఐజిఎస్ మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మే 5,6 వ తేదీలలో భద్రాచలంలో జరిగే తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలన్నారు. తెలంగాణ గ్రామాల్లో ఆదివాసి హక్కులు చట్టాలు అమలుపరచాలని , అటవీ హక్కుల పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి హక్కులు అమలు చేయాలని జల్ జంగిల్ జమీన్ హమారా నినాదంతో పోరాడిన ఆదివాసీ పోరాట యోధులు కొమరం భీమ్, బిర్సా ముండా, సమ్మక్క సారలమ్మ, అల్లూరి సీతారామరాజు, సోయం గంగులు, కుంజ బుజ్జి ,సున్నం రాజయ్య స్ఫూర్తితో నిత్యం ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలన్నారు. విద్య, వైద్యం, భూ సమస్యల వంటి అనేక సమస్యలపై ,చట్టాలు రక్షణకై ప్రభుత్వపై ఒత్తిడి పెంచి వాటి అమలుకై ఉద్యమించాలన్నారు.

అయిదవ షెడ్యూలు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం అటవీ సంపాదన కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని అటవీ సంరక్షణ నియమాలను వెనక్కి తీసుకోవాలని, భద్రాచలం మూడు గ్రామ పంచాయతీలుగా కాకుండా ఒకే గ్రామపంచాయతీ కొనసాగించి గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఆదివాసీ గ్రామాల్లో వేసవిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే రమేష్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతచిచ్చులు రేపి గిరిజనులను విభజిస్తుందని మండిపడ్డారు. ఆదివాసీలను అడవి నుండి షెడ్యూలు ప్రాంతాల నుండి గెంటివేస్తూ కనీసం పాదను ఇతర సహజ వనరులను కార్పోరేట్ల కట్టబెడుతుందన్నారు. ఈ స్థితిలో గిరిజన తెగను సంఘటితం చేసి వారి భాష సంస్కృతిని పరిరక్షించేందుకు గిరిజన గిరిజన తెగలను ఐక్యం చేసేందుకు మహాసభలు ఏర్పాటు చేస్తున్నామని ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న, మండల కమిటీ సభ్యులు మడివి రమేష్, నట్టి శంకరయ్య, కల్తి వెంకటేశ్వర్లు, పాండురంగాపురం సర్పంచ్ ఈసం భవతి, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.