రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా..?

రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా..?
ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రెజ్లర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలి. వారికి మనందరం గౌరవం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ ఆదివారం రణరంగమైన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రెజ్లర్ల పట్ల కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు కర్కశంగా ప్రవర్తించాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడానికి నిరసనగా ఆదివారం కొత్త పార్లమెంట్‌ భవనం వద్ద ‘మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌’ నిర్వహించ తలపెట్టారు. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు నిర్బంధించారు. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, భజరంగ్‌ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్‌ స్టేషన్లకు తరలించి, రెజ్లర్లపైనే కేసులు నమోదుచేశారు. నిందితుడ్ని ప్రభుత్వం రక్షిస్తున్నదని వినేశ్‌ ఫొగట్‌ ఆక్షేపించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking