ఇందిరమ్మ ఇండ్లలో
పారదర్శకత ఉండాలి
ఆరోపణలకు తావివ్వొద్దు
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు, సిబ్బంది ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గ్రౌండింగ్ మొదలుకొని ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పూర్తి పారదర్శకత ప్రదర్శించాలని చెప్పారు.
గురువారం ఆమె నల్గొండ జిల్లా, దామరచర్ల ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఎంపీడీవో, తహసిల్దార్, మండల ప్రత్యేక అధికారి , గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు.

లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని, ఇండ్లు నిర్మించుకున్న వారికి నిబంధనల మేరకు వివిధ స్థాయిలలో చెల్లింపులు చేయాలని, ఇళ్ల నిర్మాణంలో విమర్శలు, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వవద్దని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు వారి ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలకు లోబడి ఇల్లు నిర్మించుకున్న వారికి మాత్రమే బిల్లుల చెల్లింపు జరుగుతుందని, ఈ విషయంలో లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి ,డిసిఓ పత్యా నాయక్, తహసిల్దార్ జావహార్ లాల్, ఎంపీడీవో, గృహ నిర్మాణ ఏఏ లు తదితరులు ఉన్నారు.