అభివృద్ధి పనుల్లో
వేగం పెంచాలి
రూ.350 కోట్లతో
అభివృద్ధి పనులు
కోస్గి పట్టణ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష
నారాయణపేట, అక్షిత ప్రతినిధి :
కోస్గి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కడ, టీయూఎఫ్ఐడీసీ నుంచి మంజూరైన రూ.350 కోట్ల నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టర్ కోస్గి మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి పనులపై ప్రజా ఆరోగ్య శాఖ,మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.పట్టణంలో నిర్మించే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తుఫాను నీటి కాలువలు, ప్రధాన లింక్ రోడ్లు, అంతర్గత సిసి రోడ్లు, నీటి సరఫరా పైపు లైన్ల పనుల పురోగతి పై చర్చించారు. ప్రస్తుతం వాటి నిర్మాణ పనుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని మూడు జోన్లుగా విభజించి చేపడుతున్నట్లు పబ్లిక్ హెల్త్ ఈ ఈ విజయ్ భాస్కర్ గూగుల్ మ్యాప్ తో కోస్గి పట్టణ స్వరూపం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించే మూడు జోన్ల గురించి మ్యాప్ ద్వారా కలెక్టర్ కు క్రుప్తంగా వివరించారు. అనంతరం కలెక్టర్ పట్టణంలో యుజిడి లేయింగ్ ఏరియా, డంపింగ్ యార్డ్, ప్రధాన లింక్ రోడ్లు, సైన్స్ మ్యూజియం, బిసి కాలనీలోని పార్కుల ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. సoపల్లి శివాలయం ఆలయ ప్రాంతాన్ని సందర్శించారు. ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా మున్సిపల్, ప్రజా ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసిల్దార్ బక్క శ్రీనివాస్, ఇంజినీర్ జ్ఞానేశ్వర్, వర్క్ ఇన్స్ పెక్టర్ బాల్ రామ్ పాల్గొన్నారు.