అద్భుత పాలసీ
జాతికి అంకితం
క్యూర్, ప్యూర్
రేర్ పాలసీలు
3 ట్రిలియన్ల
ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
ప్రతిష్టాత్మకంగా
గ్లోబల్ సమ్మిట్
మోడీ, రాహుల్,
ఖర్గేలకు ఆహ్వానo
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ ప్రగతి దిశగా అడుగులు వేసేందుకు గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించామని సచివాలయంలో సీఎం, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అద్భుత పాలసీని జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్టు పేర్కొన్నారు.

“విజన్ డాక్యుమెంట్ 2047లో విజన్, స్ట్రాటజీ.. రెండు ప్రధాన అంశాలు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పారదర్శక పాలసీలు ఉండాలి. పాలసీలకు పెరాలసిస్ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుంది. ఐఎస్బీ, నీతి ఆయోగ్ సంస్థల సహకారంతో పాటు విజన్ డాక్యుమెంట్ తయారీలో లక్షలాది మందిని భాగస్వాములను చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. నెట్ జీరో సిటీ కాలుష్య రహిత నగర హైదరాబాద్ గా మార్చాలి. కోర్ అర్బన్ రీజియన్ ను సర్వీస్ సెక్టార్ గా మారుస్తున్నామన్నారు.

కొత్తగా క్యూర్, ప్యూర్, రేర్ పాలసీలు తీసుకు వస్తున్నాం. ఆదాయం పెంచి.. పేదలకు పంచే విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తాం. 2034 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ నుంచి 5 శాతం అందిస్తున్నాం. దీన్ని 10 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవేలు, బుల్లెట్ రైళ్ల కోసం కేంద్రాన్ని ఒప్పిస్తున్నాం. తెలంగాణకు మరో 4 విమానాశ్రయాలు తీసుకొస్తున్నాం. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్పోర్టులు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్- మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం కేంద్రంతో అంగీకారం కుదిరింది. హైవేలు, పోర్టులు, ఎయిర్పోర్టు కనెక్టివిటీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీని నియమించనున్నారు. ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేస్తారు. ఎవరిని ఆహ్వానించారు.. ఎవరు ఆహ్వానించారు.వారి రాకను నిర్ధారించడం, వచ్చే వారికి తగిన వసతులు కల్పించడంతో పాటు వారికి లైజనింగ్ చేసేందుకు ఉన్నతాధికారుల నియామకం అన్నింటిని ఆహ్వాన కమిటీ నిర్ధారించనుంది. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డ్యాష్బోర్డ్ ద్వారా సీఎం పర్యవేక్షించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని.. అందులో వెయ్యి మంది ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.