రహదారి భద్రత
సామూహిక బాధ్యత
ఎంవీఐ శ్రీనుబాబు
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ చైతన్యంతో వ్యవహరించాలని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) శ్రీనుబాబు అన్నారు. నిజాంపేటలోని సుశీల్ టీవీఎస్ ప్రాంగణంలో గురువారం రహదారి భద్రత అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ వంటి అంశాలు రహదారి ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
రహదారి ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఇది సామూహిక బాధ్యతగా ప్రతి పౌరుడు భావించాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కట్టుదిట్టంగా పాటించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అరుణపూర్ణ, సుశీల్ టీవీఎస్ నిర్వాహకులు, రవాణాశాఖ ఉప ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.