*మేడ్చల్ ట్రాఫిక్ సీఐ ప్రవర్తనపై విమర్శలు
విద్యా కమిషన్ సభ్యురాలి ఆగ్రహం*
అక్షిత న్యూస్ /గాజులరామరం:
సుచిత్ర వద్ద జరిగిన ఘటనలో మేడ్చల్ ట్రాఫిక్ సీఐ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు సోషల్ మీడియా ద్వారా వెల్లువెత్తాయి . తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, కాంగ్రెస్ నాయకురాలు జ్యోత్స్న శివారెడ్డి కుటుంబంతో ప్రయాణిస్తుండగా, ట్రాఫిక్ సీఐ మధుసూదన్ దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు.

ఈ ఘటనపై ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో కొంతమంది అధికారులు మానవీయత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు ఉంటే ఫైన్ వేయాల్సింది పోయి, కుటుంబ సభ్యులతో పాటు మైనర్ పిల్లలను కూడా కార్ దిగమని చెప్పడం, కార్–ఫోన్ సీజ్ చేస్తానని బెదిరించడం అనుచితమని పేర్కొన్నారు. విధుల్లో ఒత్తిడి సహజమే అయినా, అది అహంకారానికి కారణం కాదన్నారు. ఈ ఘటన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల శిక్షణ, ప్రవర్తనా ప్రమాణాలపై చర్చకు దారితీసింది. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
*సీఐ మధుసూదన్ వివరణ*
సుచిత్ర వద్ద సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినందుకే కారును ఆపామని, వారి హోదా తెలియదని తెలిపారు.

సుమారు 15 నిమిషాలు వాదన జరిగిందని, ఆ సమయంలో ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. విధి నిర్వహణలో భాగంగానే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.