సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణ పేట, అక్షిత ప్రతినిధి:
నారాయణపేట జిల్లాలో జరగనున్న నాలుగు మున్సిపాలిటీల నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా మరియు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం, అవాస్తవ వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు లేదా అసత్య ప్రచారాలు చేస్తే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోషల్ మీడియాపై నిఘా కొరకు ప్రత్యేక సోషల్ మీడియా మోనిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని విరు నిరంతరం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను, పోస్టులను గమనిస్తూ ఉంటారని ఎవరైనా ఒకరిని కించపరిచే విధంగా, ఒక వర్గానికి చెందిన వారిపై తప్పుడు పోస్టులు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలను విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మరియు సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే మెసేజ్లు, వీడియోలు లేదా పోస్టులను ప్రోత్సహించవద్దని సూచించారు. ఏదైనా సమాచారాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేసే ముందు దాని నిజానిజాలను నిర్ధారించుకోవాలని, అభ్యంతరకర కంటెంట్ విషయంలో గ్రూపు అడ్మిన్లు తక్షణమే వాటిని తొలగించాలని తెలిపారు. జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఎస్పీ కోరారు.