కరీంనగర్ కు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి
నేడు ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత సదస్సులో పాల్గొననున్న డీజీపీ
కరీంనగర్ అక్షిత బ్యూరో
కరీంనగర్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల 5వ రోజు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గురువారం కరీంనగర్ చేరుకున్నారు.ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు భద్రత అవగాహన సదస్సులలో భాగంగా, నేడు శుక్రవారం కరీంనగర్లో నిర్వహించే జిల్లా స్థాయి భారీ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గురువారం కరీంనగర్ చేరుకున్న డీజీపీ కి జిల్లా పోలీసు యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఆయన, శుక్రవారం ఉదయం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అనంతరం రోడ్డు భద్రతపై ఏర్పాటు చేసిన సదస్సులో ప్రజలను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ప్రాణం కన్నా వేగం మిన్న కాదు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ – అలైవ్’ నినాదంతో సాగుతున్న ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.నిబంధనల అమలు హెల్మెట్ ధారణ, సీటు బెల్టు ప్రాధాన్యత మరియు మితిమీరిన వేగం వల్ల కలిగే అనర్థాలపై డీజీపీ దిశానిర్దేశం చేయనున్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో పోలీసు శాఖ పాత్రను ఆయన వివరించనున్నారు. నేడు జరగనున్న ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.
