మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!

మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!

చౌటుప్పల్ బంగారుగడ్డలో ఆర్పీ అరాచకం -లోన్‌కు రూ.1000 ‘కట్’ తప్పనిసరి…?

నిరుపేద మహిళలపై అదనపు భారం – భయంతో నోరు విప్పలేని బాధితులు

ఉమ్మడి నల్గొండ అక్షిత బ్యూరో

నిరుపేద మహిళలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన మహిళా సంఘాలు, ఇప్పుడు కొందరి చేతుల్లో ‘కమిషన్ల కేంద్రాలుగా’ మారుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందించాల్సిన బాధ్యతలో ఉన్న రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సభ్యుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటన చౌటుప్పల్ పరిధిలో కలకలం రేపుతోంది. బంగారుగడ్డ ప్రాంతానికి చెందిన మహిళా సంఘాలకు బ్యాంకు లోన్లు ఇప్పించే క్రమంలో ఆర్పీ శోభ బహిరంగంగానే ఒక్కో సభ్యురాలి నుంచి రూ.1000 చొప్పున ‘కమిషన్’ వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లోన్ ప్రాసెస్ చేయాలన్నా, సంతకాలు పెట్టాలన్నా డబ్బులు తప్పనిసరి చేస్తున్నారని వారు వాపోతున్నారు.ఇప్పటికే అప్పుల భారంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న తమపై ఈ అదనపు భారం మోపడం అన్యాయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో లోన్లు రాకుండా చేస్తారనే భయంతో చాలామంది మౌనం వహిస్తున్నారు.మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను కొందరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మహిళా సంఘాల్లో జరుగుతున్న ఈ ‘కమిషన్ల’ దందాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking