ఓటు హక్కు మనందరి బాధ్యత
పెద్ద ఆడిశర్లపల్లి, అక్షిత ప్రతినిధి :
ఓటు హక్కు మనందరి బాధ్యత అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు గురువారం ఆయన జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేతతో కలిసి పెద్ద ఆడిశర్లపల్లి,గుడిపల్లి మండలాల్లో పర్యటించారు. ఎర్రగుంట తండా, మూనావత్ తండా, అంగడిపేట, గుడిపల్లి గ్రామాల్లో బిఎల్ఎ లు, బిఎల్ఓ లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సర్ విధానంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అధికారులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించి, అవసరమైన పత్రాలు సకాలంలో సమర్పించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి బూత్లో 100 శాతం సర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఆదేశించారు. ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయకుండా స్వయంగా తమ వివరాలు సరిచూసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఎల్వో లు, బిఎల్ఎలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు