ఎల్నినోపై రైతులకు అప్రమత్తత పిలుపు!
పంటల ఎంపికలో జాగ్రత్త.. నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి…
లోకేశ్వరంలో ప్రత్యేక గ్రామసభ.. రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓ రుచిత
లోకేశ్వరం, ఆగస్టు 9 (అక్షిత న్యూస్ ):
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు లోకేశ్వరం గ్రామంలో ఎల్నినోపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధర్వాడి కపిల్,మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని,నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో సాగు చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓ రుచిత,మాట్లాడుతూ ఎల్నినో కారణంగా వాతావరణంలో మార్పులు,వర్షపాతంలో హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటల సాగులో నీటి యాజమాన్యం, ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటితో సాగు చేసే పద్ధతులు పాటించాలని వివరించారు.నీటి ఎద్దడి పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.వ్యవసాయ శాఖ అందించే సూచనలు, సాంకేతిక సలహాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, కారోబర్ శ్రీధర్,రైతులు,గ్రామ పెద్దలు,రైతులు తదితరులు పాల్గొన్నారు…