ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
– 6 డీఏలు, పీఆర్సీ వెంటనే ప్రకటించాలి – సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి
– టీఎస్యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్ డిమాండ్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యుటీఎఫ్) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం రామన్నపేట మండలంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ ఇవ్వాలి గత మూడు సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన 6 డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని రవికుమార్ కోరారు. అలాగే సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 25ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, 317 జీవో బాధితుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
సెప్టెంబర్ 10న హైదరాబాద్లో భారీ ధర్నా
ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో టీజీ ఈజేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు కంచి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎస్యుటీఎఫ్ సీనియర్ నాయకులు మోహన్రెడ్డి, కట్ట కృష్ణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అనిల్కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మంకాల కుమారస్వామి, ఉపాధ్యక్షులు ఘాసిరాం, కోశాధికారి కర్నె త్రివేణి ప్రసాద్, ఎఫ్డబ్ల్యూఎస్ మండల కన్వీనర్ మధుబాబు, సీనియర్ నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.